తుళ్లూరు: అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ సీఎం జగన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం తుళ్లూరులో జరిగిన రైతుల ఆందోళన దీక్షకు సంఘీభావం ప్రకటించిన సుంకర పద్మశ్రీ… ‘చెప్పుదెబ్బలు తింటావ్ జగన్మోహన్ రెడ్డి’ అంటూ చెప్పు చూపించి సీఎంను హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న అంబటి రాంబాబును ఆమె పిచ్చి కుక్కతో పోల్చారు. అర్థరాత్రి అరెస్ట్ చేయడానికి రైతులు జగన్ తరహాలో జైలుకు వెళ్లలేదని అన్నారు. ఏపీ డీజీపీ సీఎం జగన్కు చెంచాగిరి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ‘ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మహిళలతో పెట్టుకొవద్దు’ అని హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీదేవి బ్యూటీ పార్లర్లో ఉందని ఇక్కడి మహిళలు అంటే వారిపై కేసులు పెట్టారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. కేసులు పెడితే తాము భయపడబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ కమిటీ నేతలు మాట్లాడుతూ.. హైపర్ కమిటీ ప్రభుత్వానికే అనుకూలంగా నివేదిక ఇస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తాము వ్యతిరకం కాదని.. పాలన అమరావతి నుంచే జరగాలని డిమాండ్ చేశారు. ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం లేదని, అమరావతే రాజధాని అని ప్రకటించే వరకూ తమ నిరసనలు ఆగవన్నారు. రాజధాని రైతులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పరిరక్షణ సమితి నేతలు చెప్పారు.