చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ (82) చెన్నై ఎగ్మోర్లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మణదత్కు భార్య ఇందిరా దత్, కుమార్తె కవిత ఉన్నారు. మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో దత్ క్రియాశీల పాత్ర పోషించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. 1989లో ఆయనను యాజమాన్య రత్న పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. 1991లో నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీని ప్రదానం చేసింది. ఆయన గతంలో ఫిక్కీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, గుంటూరు జిల్లా మాచర్ల, చెన్నైలో కేసీపీ పరిశ్రమలను స్థాపించారు. దత్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సహా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.