అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల చేతికి డబ్బులు అందనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ నెల ఎడవ తేదీన గుంటూరులో చెక్కులు పంపిణీ లాంఛనంగా ప్రారంభిస్తారు. పది వేల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులకు గానూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా 264 కోట్ల రూపాయలు విడుదల చేసింది. చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని సిఐడి అధికారులను డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. తమ అయిదేళ్ల పోరాట ఫలితంగా తొలి ఫలం బాధితులకు అందబోతోందని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్పేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని అనేక పోరాటాలు చేశామని పేర్కొన్న ఆయన ఈ నెల 18,19 తేదీలలో నిర్వహించతలపెట్టిన దీక్షలను రద్దు చేసినట్లు తెలిపారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకూ బాధితుల సంఘం ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
విజయవాడ కేంద్రంగా నెలకొల్పిన అగ్రిగోల్డ్ సంస్థ దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ఘఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లోని 19.19 లక్షల మంది నుండి 6,380 కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించింది. ఇందులో ఏపిలోనే పది లక్షలకు పైగా డిపాజిటర్లు ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది. కాల పరిమితి ముగిసిన బాండ్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని ప్రాంతాల నుండి కూడా ఫిర్యాదులు రావడంతో గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించింది. సిఐడి అధికారులు అగ్రిగోల్డ్ చైర్మన్తో పాటు డైరెక్టర్లు, ఇతర ముఖ్యులను అరెస్టు చేసి ఏపితో పాటు పలు రాష్ట్రాల్లోని 3,785 కోట్ల రూపాయల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. అత్యధికంగా ఏపిలో 2,585 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తులో ఉన్నాయి. వాటిని వేలంలో విక్రయించి డిపాజిటర్లకు పంపిణీ చేయాలని మూడేళ్ల క్రితం డిపాజిటర్ల సంఘం పేరుతో హైకోర్టులో పిల్ దాఖలైంది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను జిల్లా కమిటీలతో కలిసి సిఐడి మొదలు పెట్టింది. డిపాజిటర్లు ఆందోళనకు దిగడంతో గత ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ఇచ్చి అయిదు వేల లోపు డిపాజిటర్లకు స్వాంతన చేకూర్చేందుకు యత్నించింది. ఎన్నికల తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడింది. అగ్రిగోల్డ్ అస్తులను వేలం వేసేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నందున ముందుగా చిన్న మొత్తంలో డిపాజిట్లను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో సిఐడి అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి వివరాలు అందజేశారు. పది వేల రూపాయలలోపు డిపాజిట్ చేసిన ఖాతాదారులు మూడున్నర లక్షల మంది ఉన్నారని సిఐడి దర్యాప్తులో వెల్లడైంది.
ఆ జాబితాను న్యాయ కమిటీలకు పంపి ఆ తర్వాత హైకోర్టు అనుమతితో డబ్బు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు.