న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం(జనవరి 14) ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ పిటిషన్ ను గురువారం రాత్రి రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ పంపించింది. దీంతోపాటే వీరికి క్షమాభిక్ష పెట్టవద్దని రాష్ట్రపతిని కోరింది. ఈ నేపథ్యంలో పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్రపతి రామ్ నాథ్ ఎక్కువ సమయం కూడా తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించారు. క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కాబోతోంది.
నిర్భయ కేసులో నలుగురు దోషులను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ తో ఆటంకం ఏర్పడింది. ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున శిక్ష అమలు చేయలేని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్, ఉరిశిక్ష అమలు మధ్య 14 రోజుల పాటు గడువు ఉండాలని.. అందువల్ల జనవరి 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని పేర్కొంది. నిబంధనల ప్రకారం కేసులో ఒకరికంటే ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు వారిలో ఒకరు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నా.. అది తేలే వరకు మిగిలిన వారికీ శిక్షను అమలు చేయడం కుదరదు. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 22న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో అధికారులు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 22న ఉరిశిక్ష అమలవుతుందా? లేని మరి కొన్ని రోజులు పడుతుందా? అనేది ఉత్కంఠగా మారింది.
ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ (26), ముకేశ్ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీంతో దోషులు ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ జనవరి 9న తమకున్న చిట్ట చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై మంగళవారం(జనవరి 14) ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్లను కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయాలని భావించారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే, క్షమాభిక్ష కోరుతూ ముకేశ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అభ్యర్థిన సమర్పించాడు. దానిపై రాష్ట్రపతి నిర్ణయం వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఉరిశిక్ష అమలు జరగదని హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. జైళ్ల నిబంధనల ప్రకారం ఉరి శిక్ష పడిన కేసులో దోషులు క్షమాభిక్ష పిటిషన్ కోసం వేచి చూడాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కేవలం దోషి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతనే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని తెలిపింది. అప్పటివరకు నలుగురు దోషులలో ఎవరినీ జనవరి 22 న ఉరితీయలేమని స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ.. డిసెంబర్ 29న ప్రాణాలు విడిచింది. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్, వినయ్ శర్మ, పవన్, అక్షయ్ కుమార్ సింగ్ లను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం నలుగురు దోషులు ఢిల్లీలోని తీహార్ జైలులోఉన్నారు.