(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 20 రోజుల నుంచి చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో అందరికి తెలిసిపోయింది. సమ్మెలో దిగిన ఆర్టీసీ కార్మికులు డిస్మిస్ అయినట్టేనని మరోమారు సీఎం కేసీఆర్ అనడంతో కార్మికులలో ఆందోళన నెలకొంది. యూనియన్ ఉచ్చులో పడి మీ రక్తం మీరే పీల్చుకుంటున్నారని, మీ ఆర్టీసీని మీరే కాలబెట్టుకుంటున్నారని కార్మికులను హెచ్చరించారు కేసీఆర్. అంతేకాదు ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానం అని చేసిన కేసీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ ఎలా ముందుకు వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది. సీఎం వ్యాఖ్యలతో ఎన్నో ఆర్టీసీ కార్మిక కుటుంబాల ముఖాల్లో ఆందోళన కనిపించింది. ఉద్యోగం పోతుందన్న మనస్తాపంతో ఇప్పటికే కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరి గుండె ఆగింది. ఇంటికి ఆసరాగా ఉన్న ఉద్యోగం పోయిందని, నెల నెలా ఇంటిని ఎలా నెట్టుకొచ్చేదంటూ దు:ఖంలో మునిగిపోయారు. అదీకాక.. దసరా ముందు సెప్టెంబరు నెల జీతాలు రాకపోవడం వారిని మరింత కుంగదీసింది.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవరు ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి పరాకాష్టగా నిలిచాయని, కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. యూనియన్ల వల్లే ఆర్టీసీ ఇంకా బతికి ఉందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కష్టం అని.. కేసీఆర్ అయ్య జాగీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని.. ఇలాంటి సీఎంలను చాలా మందిని చూశానని పేర్కొన్నారు.
ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సమ్మె నేటితో 21వ రోజుకు చేరింది. వీరికి దసరా పండగకు వేతనం రాకపోగా దీపావళికి వచ్చేలా లేదు. దీంతో వారి కుటుంబాల్లో దీపావళి వెలుగులు కనిపించే పరిస్థితి లేదు. ఆర్టీసీ కార్మికులకు ఇప్పటివరకు సెప్టెంబర్ జీతం కూడా రాలేదు. ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. ఈనెల 30న సరూర్ నగర్లో ‘సకలజనుల సమరభేరీ’ సభను నిర్వహించనున్నారు. కేసీఆర్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలను తీసుకుంటున్నట్టు సమాచారం. సీఎం వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.