హైదరాబాద్: చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాప్తిస్తోంది. కరోనా వైరస్ ఆనవాళ్లు ఇప్పుడు ఇండియాలోనూ కనిపించడం కలకలం రేపుతోంది. రాజస్థాన్, తెలంగాణలో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఫీవర్ ఆసుపత్రిలో చేరాడు. ఆ యువకుడి నుంచి నమూనాలను సేకరించి పుణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపించగా.. కరోనా వైరస్ లేదని తేలింది. అయితే ఇదే తరహాలో ఆదివారం మరో నలుగురు ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. వీరు చైనా, హాంగ్ కాంగ్ దేశాల నుంచి వచ్చారు. ఈ నలుగురినీ ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపించడంతో అతడి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పుణెకు పంపించారు. ఈ ఫలితాలు సోమవారం వస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి. మిగిలిన ముగ్గురిలో ముక్కు కారడం తప్ప మరే ఇతర లక్షణాలు లేవు.
మరోవైపు, నమూనాలు సేకరించిన వ్యక్తి ఫలితాల్లో పాజిటివ్ వచ్చినా.. హాస్పిటల్లోని వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి విషమించినా.. అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఎనిమిది పడకల ఐసీయూను కూడా వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. చైనా తదితర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే..వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందజేయడంతోపాటు వారి కుటుంబ సభ్యులనూ పరిశీలనలో ఉంచాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. పరీక్షల్లో కరోనా వైరస్ లేదని నిర్ధారించే వరకూ కుటుంబసభ్యులు, సన్నిహితంగా ఉండేవారిని ఇళ్లకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీచేసింది.
బిహార్, కేరళలోని కొచ్చిలో వైరస్ అనుమానిత లక్షణాలతో రెండు కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్ లోని జైపూర్ లో వైరస్ సొకిన ఓ అనుమానిత వైద్య విద్యార్థిని ఐసొలేషన్ వార్డులో ఉంచారు. ఆ యువకుడు ఇటీవలే చైనాలో ఎంబీబీఎస్ చదువుకుని తిరిగి వచ్చాడని, అతనిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని ఆరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ వెల్లడించారు. అతనితో పాటు అతని కుటుంబీకుల రక్త నమూనాలను కూడా సేకరించామని, వాటిని పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. చైనా నుంచి మొత్తం 18 మంది రక్త నమూనాలనూ పరిశీలిస్తామని తెలిపారు.
మరోవైపు చైనాలో భారతీయులెవరికీ కరోనా వైరస్ సోకలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. బీజింగ్ లోని భారత దౌత్య కార్యాలయం చైనాలో ఉన్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించింది. వుహాన్, హ్యుబేయ్ ప్రావిన్స్ లో ఉన్న భారత విద్యార్థులతోనూ దౌత్య సిబ్బంది టచ్ లో ఉన్నారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
చైనాలో గత డిసెంబరులో తొలి కరోనా వైరస్ కేసు వుహాన్ లో బయటపడింది. ప్రస్తుతం వుహాన్ నగరంలో ఉన్న 11 మిలియన్ల మంది ప్రజలను నగరం వరకే పరిమితం చేశారు. వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చైనాలో 56 మంది చనిపోయారు. ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా ఈ ప్రమాదకర వైరస్ బారిన పడినట్టు గుర్తించారు. చైనాలో ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితుల కోసమే యుద్ధప్రాతిపదికన వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు.