(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: జగన్ ఒక ఉన్మాది ముఖ్యమంత్రి, కాబట్టే దుర్మార్గమైన విధినాలు అవలంబిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానిపై ఏం జరుగుతుందో అని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఉంటే శాసనమండలి లైవ్ ప్రసారాలు నిలిపివేశారన్నారు. లైవ్ ప్రసారాలు ఎందుకు ఆగిపోయాయని అడిగితే సాంకేతిక సమస్య అని చెబుతారు, గట్టిగా నిలదీస్తే అయిదు నిమిషాలు ఇచ్చి మళ్లీ నిలిపివేయించారని ఆరోపించారు. ఎప్పుడూ ఇంత ఆరాచకమైన పాలన చూడలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, తాను ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకున్నామని ఆయన తెలిపారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రెండు రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. సభల్లో సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు.
రాజ్యాంగంలో క్యాపిటల్ అన్న పదం లేనప్పుడు మూడు క్యాపిటల్స్ పేరుతో తీర్మానం ఎలా ప్రవేశపెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు.
అసెంబ్లీలో బిల్లుపై చర్చకు ప్రతిపక్షానికి సమయం ఇవ్వలేదని దుయ్యబట్టారు. సాయంత్రం వరకు మైక్ ఇవ్వకుండా చేశారని ధ్వజమెత్తారు.శాసనమండలిలో చైర్మన్కు విచక్షణాధికారం ఉంటుందనీ ఈ సందర్భంగా చంద్రబాబు మరో సారి గుర్తుచేశారు. వైసిపి నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకపక్షంగా దాడి చేశారని ఆయన నిప్పులు చెరిగారు. తమను మార్షల్స్తో బయటపడేయాలని సీఎం జగన్, స్పీకర్కు చెప్పాడని ఆరోపించారు. ముఖ్యమైన బిల్లుపై లాభనష్టాలు చెప్పడం తమ బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు.పలు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసి మీడియా స్వేచ్చను హరిస్తున్నారని అన్నారు.
ఒకరిద్దరు సభ్యులను డబ్బులతో కొన్నారని ఆరోపించారు. మండలి చైర్మన్ను వైసీపీ నేతలు బూతులు తిట్టారన్నారు. గ్యాలరీ నుంచి తనను వెళ్లిపోమని చెప్పారనీ, సెల్ ఫోన్ ఉండొద్దని చెప్పారనీ పేర్కొన్నారు. వైసిపి నేతలు మాత్రం సెల్ఫీలు తీసుకున్నారన్నారు. కౌన్సిల్లో బిల్లు పాస్కాకపోవడం జగన్కు అవమానమా అని ప్రశ్నించారు. టిడిపి నేతలు వారికి ఊడిగం చేయరని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో మండలిని రద్దు చేసే అధికారం జగన్కు లేదన్నారు. తీర్మానం చేసి కేంద్రంకు పంపాలన్నారు. సెలెక్ట్ కమిటీ నిర్ణయం చెప్పే వరకు ఇది కుదరదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలను దారిలోకి తెచ్చుకోవాలనే శాసనమండలిని రద్దు ఎత్తుగడ వేశారని విమర్శించారు. ఒక వేళ రద్దు అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పునరుద్ధరిస్తామన్నారు.
సిఎం జగన్ అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయమని అందుకే వారి అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నారని అన్నారు. టిడిపిలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిర్భయంగా వారి అభిప్రాయాలను వెల్లడిస్తారని చంద్రబాబు అన్నారు. 151 మంది వైసిపి ఎమ్మెల్యేలలో సగం మందికిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు.
చివరకు మీడియా ప్రతినిధులపైనా కేసులు నమోదు చేశారని విమర్శించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా పాలన చేస్తామంటే కుదరని చంద్రబాబు అన్నారు. కేసులకు, బెదిరింపులకు, ప్రలోభాలకు టిడిపి సభ్యులు లొంగరని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టిడిిపి సభ్యులు, మండలి చైర్మన్ను ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు.