హైదరాబాద్: ఆర్టిసి కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కార్మికుల సమ్మె విరమింపజేయాలని కోరుతూ ఓయూ సంఘం నేత సురేంద్ర సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం, యూనియన్ నేతల పట్టుదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని తెలిపింది. హైకోర్టు సూచన మేరకు సమ్మె విరమిస్తే కార్మికుల సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని వారి తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఈ నెల అయిదవ తేదీ నుండి సమ్మె జరుగుతున్నా విరమింపజేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానికి తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. సుమారు నాలుగు వేల బస్సులు నడపడం లేదనీ దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
సమస్య ఆర్టిసి యాజమాన్యం, కార్మికుల మధ్య మాత్రమే కాదనీ అది ప్రజల సమస్యగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వైపు ఆర్టిసి కార్మికులపై ఎస్మా ఎందుకు అమలు చేయకూడదో చెప్పాలని కార్మిక సంఘాలను హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతం కావచ్చు, కానీ పండుగ సమయంలో రవాణా నిలిపివేస్తే ఎలా అని అగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఇబ్బందులను కార్మిక సంఘాలు పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కార్మికుల్లో విశ్వాసం పెంచేందుకు ముందుగా ఆర్టిసి ఎండిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఇరుపక్షాల వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల అయిదవ తేదీ నుండి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.