(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారీ కట్నంతో పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్లి ఆ తర్వాత భార్యలను వదిలిపెట్టే పురుషపుంగవులకు వారు సింహస్వప్నం. అలాంటి భర్తల పాస్పోర్టును వారు సస్పెండ్ చేయిస్తారు. వీలైతే రద్దు చేయిస్తారు. వీరికి స్ఫూర్తి నిచ్చింది చండీగఢ్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి శిబాష్ కబిరాజ్.
నిజాయితీకి, అంకితభావానికీ నిలువెత్తురూపమైన కబిరాజ్ భర్తలు వదిలిపెట్టి పోయిన మహిళల పరిస్థితి చూసి చలించిపోయారు. తనను వంచించి వదిలివెళ్లిన భర్త పాస్పోర్టు రద్దు కోరుతూ కబిరాజ్ దగ్గరకు వచ్చే మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. కాస్త ఆలోచించిన మీదట పాస్పోర్టు రద్దు చేయించడం పెద్ద కష్టమేమీ కాదని కబిరాజ్కు తట్టింది.
భార్యకు తప్పు సమాచారం ఇచ్చినందుకు భర్త పాస్పోర్టు సస్పెండ్ చేయించవచ్చు. అయితే అందుకు కావాల్సిన పత్రాలను తయారు చేయడం చిన్న పని కాదు. ‘ఆ పని మీరు చేస్తే నా పని నేను చేస్తాను’ అని ఆయన తన దగ్గరకు వచ్చిన మహిళల ముందు ప్రతిపాదించారు. వారి కోసం పాస్పోర్టు కార్యాలయంలో ఒక గది కేటాయించారు. అందులో ఒక కంప్యూటర్, ప్రింటర్, ఫ్యాక్స్ మెషిన్ సమకూర్చారు. అలా మొదలయింది ఈ యాత్ర.
అమృత్పాల్ కౌర్ కుటుంబం ఆమె పెళ్లి కోసం దాదాపు పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. పెళ్లి అయిన మూడు రోజులకు ఆమె భర్త కులప్రీత్ సింగ్ మరో 15 లక్షలు డిమాండ్ చేశాడు. పెళ్లికి ముందు రెండేళ్ల పాటు అమృతపాల్ ఇంగ్లండ్లో పని చేసిన సంపాదించిన డబ్బు కూడా తనకే రావాలన్నాడు. రెండు వారాల తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడనుంచి విడాకుల పత్రాలు పంపాడు.
అమృత్పాల్ కౌర్ ఇప్పుడు చండీగఢ్లో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. పాస్పోర్టు ఆఫీసులో కబిరాజ్ కేటాయించిన గదిలో కూర్చుని అక్కడకు వచ్చే తనలాంటి మహిళలకు పత్రాలు తయీరుచేయడంలో ఆమె సాయపడుతుంది. కంప్యూటర్లో ఈ సమాచారం ఉండే ఫోల్డర్కు ఆమె మిషన్ శక్తి అని పేరు పెట్టింది. ‘మాలాగా అమ్మాయిలు మోసపోతే ఊరుకోం’ అని ఆమె అంటుంది. సహాయం కోసం వచ్చే మహిళలకు ఆమె తన ఇంట్లో ఆశ్రయం కూడా ఇస్తుంది.
గత ఏడాదిన్నర కాలంలో భార్యల ఫిర్యాదులపై 400 మంది భర్తల పాస్పోర్టులు సస్పెండ్ అయ్యాయి. 67 మంది పాస్పోర్టులు రద్దయ్యాయి. భర్తలు తమను అన్యాయంగా వదిలిపెట్టినట్లు అయిదు వేల మందికి పైగా మహిళలు విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉన్న భర్త వదిలిపెట్టిన మహిళ జీవితం దుర్భరంగా మారుతుంది. కార్యకర్త శివాలీ సుమన్ మాటల్లో చెప్పాలంటే: ‘మా హోదా ఏమిటి, మేము విడాకులు తీసుకున్నట్లా, సింగిల్ వుమెన్ కింద లెక్కా, లేక విధవలమా?
ఎన్నారైలపై చర్య తీసుకోవడం అంత తేలిక కాదు. వారు పంపే నిధుల కారణంగా ప్రభుత్వం వారిని విఐపిల కింద చూస్తుంది. 2018లో ఎన్నారైలు ఇండియాకు 7,900 కోట్ల డాలర్లు (దాదాపు 5,63,790,00 కోట్ల రూపాయలు) పంపారు. 2019లో అది సుమారు 8220 కోట్ల డాలర్ల మేరకు పెరగవచ్చని అంచనా. ఇలాంటి విలువైన వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి వ్యవస్థ సహజంగానే సందేహిస్తుంది. అందుకే కట్నం తీసుకుని వివాహం చేసుకున్న తర్వాత విదేశాలు చెక్కేస్తే తమని అడిగేవాడు ఉండరన్న ధీమాతో వ్యవహరించే పురుషులు ఎక్కువగా తయారవుతున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని టూసా గ్రామం సత్వీందర్ కౌర్ స్వంత ఊరు. భర్తల సమస్యలతో సత్వీందర్ ఇంటికి మహిళలు రాని రోజు ఉండదు. ఆమెది కూడా అమృతపాల్ కౌర్ కధ వంటిదే. 2015లో ఆమెను వదిలిపెట్టిన భర్త ప్రస్తుతం పోలండ్లో ఉంటున్నాడు. తనలా మోసపోయిన మహిళలకు సాయపడాలని సత్వీందర్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె దగ్గర భర్తలు వదిలివెళ్లిన మహిళల కేసులు సుమారు 400 ఉన్నాయి. ఆ భర్తలను తిరిగి ఇండియా రప్పించడం, జైలు పాలు చేయించడం సత్వీందర్ లక్ష్యం. ఈ పనిలో భాగంగా ఆమె ఒక వాట్సాప్ గ్రూప్, ఒక ఫేస్బుక్ పేజి నడుపుతోంది. ఇలాంటి కార్యక్రమాలు నడుపుతున్నందుకు ఆమెను గ్రామంలో రకరకాలుగా నిందిస్తారు. కానీ సత్వీందర్ కౌర్ పట్టుదల సడలలేదు.
పంజాబ్లో ఇలా ఎన్నారై భర్తలు వదిలివెళ్లిన మహిళలు చాలామంది ఉన్నారు. వారిలో క్రమంగా చైతన్యం పెరుగుతోంది. గ్రామీణ మహిళలు కూడా తమకు దిక్కు లేకుండా చేసిన భర్తల విషయంలో గట్టిగా వ్యవహరించడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి వారికి అమృత్పాల్ కౌర్, సత్వీందర్ కౌర్ వంటి మహిళలు అందిస్తున్న సహాయం విలువ కట్టలేనిది.
ఎన్డిటివి కథనం ఆధారంగా