న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత శనివారం పోలీసులు, న్యాయవాదుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ మహిళా పోలీసు అధికారి దాడికి గురైంది. అంతేకాదు ఆమెకు చెందిన 9 ఎంఎం సర్వీస్ పిస్టల్ కూడా కనిపించకుండాపోయింది. యూనిఫామ్ ధరించిన ఓ మహిళా పోలీసు అధికారిణిని చుట్టు ముట్టి, దాడి చేసిన కొందరు లాయర్లు, ఆమె వద్ద లోడ్ చేసి వున్న గన్ ను ఎత్తుకుపోయారు. ఘర్షణ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఢిల్లీ పోలీసులు దీనిపై ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. పిస్టల్ మిస్సింగ్పై సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సాధారణ ఫిర్యాదుతో ఎటువంటి ప్రయోజనం ఉండదని అంతేకాకుండా అది తనను మూర్ఖురాలిగా చిత్రీకరిస్తుందని సదరు మహిళా ఐపీఎస్ అధికారి తన సహచరులతో పేర్కొన్నట్లుగా ఓ సీనియర్ అధికారి ఎన్డీటీవీకి చెప్పారు. సాధారణ ఫిర్యాదు లేకుండా తాము అధికారికంగా ఎటువంటి చర్యలు తీసుకోలేమని, కానీ లైంగిక వేధింపుల కేసుల్లో పోలీసులకు సొంతంగా వ్యవహరించే అధికారం ఉంటుందని చెప్పారు. ‘సున్నితమైన సమస్యల దర్యాప్తును వేగవంతం చేయడానికి పోలీసులపై చాలా ఒత్తిడి ఉంది. అందుకే రెండు సంఘటనల గురించి సమాచారం ఇచ్చినా సీనియర్లు అందరూ మౌనంగా ఉన్నారు’ అని సదరు పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
లాయర్ల దాడికి భయపడి పలువురు పోలీసు సిబ్బంది గదిలోకి వెళ్లి తమను తాము బంధించుకున్నారు. అయినా లాయర్లు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించి.. గది బయట ఉన్న పలు వాహనాలను తగులబెట్టారు. ఇదంతా వీడియో కెమెరాలో రికార్డు అయింది.
పార్కింగ్ విషయమై శనివారం తీస్ హజారీ కోర్టులో విధుల్లో ఉన్న ఒక పోలీసుకు, న్యాయవాదికి మధ్య తలెత్తిన వివాదం కాస్తా రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. సోమవారం సాకేత్ జిల్లా కోర్టులో ఇరుపక్షాల మధ్య మరోసారి గొడవ జరిగింది. యూనిఫాంలో ఉన్న పోలీస్పై ఓ న్యాయవాది దాడిచేశాడు. తమ సహచరులపై న్యాయవాదులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పోలీసులు నిరసనకు దిగారు. ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ లాయర్లు కోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. ఇదే సమయంలో న్యాయవాదులు ఒక పోలీసు వాహనానికి నిప్పు పెట్టడంతోపాటు, మరో 17 ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. తాము కాల్పులు జరిపామన్న లాయర్ల ఆరోపణను పోలీసు అధికారులు ఖండించారు. లాయర్లే తమపై దాడి చేసి గాయపర్చారని ఆరోపిస్తున్నారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.