అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ అనుమతి తెలిపింది. ఈ చట్టానికి ‘ఏపీ దిశ యాక్ట్’గా నామకరణం చేశారు. దిశ సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. అత్యాచార ఘటనకు సంబంధించి నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు వారం రోజుల్లోగా దర్యాప్తు,14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. మొత్తం 21 రోజుల్లోగా తీర్పు వెలువరించాలి. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ ఈ బిల్లును రూపొందించారు.
మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా పోస్ట్ లు చేస్తే సెక్షన్ 354(ఇ) కింద చర్యలు చేపట్టనున్నారు. మొదటి సారి తప్పు చేస్తే రెండు సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354(ఎఫ్) కింద పది నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో తీవ్రత ఉంటే జీవిత ఖైదు పడనుంది. పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తున్న విషయం తెలిసిందే. ఆ శిక్షను పెంచుతూ ఈ బిల్లులో అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.