అమరావతి: ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు ? అని ప్రశ్నించారు. ‘ సీఎం ఇక్కడ కూర్చుంటారా? లేక విశాఖ, కర్నూలులో ఉంటారా? ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. ప్రజలు మూడు రాజధానుల్లో తిరిగి పనులు చేసుకుంటారా? ప్రజలు అమరావతిలో ఒక ఇల్లు, కర్నూలులో మరో ఇల్లు కట్టుకుంటారా? విశాఖలో సెక్రటేరియట్ కట్టి ఏం చేస్తారు? మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే డబ్బులు ఉండాలి కదా? మండలానికి ఒక ఆఫీసు పెట్టుకోండి ఇంకా బాగుంటుంది. మూడు రాజధానులలో మంత్రులను ఏ రాజధానిలో పెట్టబోతున్నారో చెప్పాలి. అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసి రాజధానిపై నిర్ణయం తీసుకుంటున్నారు’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాజధానిలో బినామీల పేరుతో ఆస్తుల కొనుగోలు జరిగితే చర్యలు తీసుకోండని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. అమరావతిలో అవినీతి జరిగిందని భావిస్తే ఆర్నెల్లపాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. సీఎం జగన్ లాంటి వ్యక్తులకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చి ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. అక్కడి శిథిలాలు ఇంకా తొలగించలేదని, ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏం చేయగలిగారని ప్రశ్నించారు. ప్రజావేదికను కూల్చడంలో చూపించిన శ్రద్ధ పాలనపై చూపాలని సూచించారు. అమరావతిపై జగన్ కు ఎందుకు అంత కోపమని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని అన్నారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా రాజధాని కోసం రైతులు భూములిచ్చారని గుర్తు చేశారు. ఎవరో భూములు కొనుక్కుంటే టీడీపీ నాయకుల పేర్లు చెప్పడం దారుణమన్నారు. అమరావతిని ఏదోరకంగా చంపాలని కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.