(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్రావు కమిటీ రిపోర్ట్పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం మందడంలో రైతులు రోడ్డుకి అడ్డంగా కూర్చుని నిరసన తెలుపుతున్నారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుపై సిమెంటు బెంచీలు, కరెంట్ స్తంభాలు అడ్డం పెట్టారు. రోడ్డుపై రైతులు టైర్లు తగలబెట్టారు. రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు అర్ధనగ్నంగా కూర్చుని నిరసన తెలిపారు. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుళ్లూరులో రోడ్లపైనే రైతులు వంటావార్పు చేపట్టారు. సీఎం ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందడంలో పోలీసులు భారీగా మోహరించారు. తాము ఏ రాజకీయ పార్టీలకు భూములు ఇవ్వలేదని… ప్రజలు, ప్రభుత్వం కోసమే ఇచ్చామని రైతులు తెలిపారు. తమకు అన్యాయం చేస్తారా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, మందడం మెయిన్ సెంటర్లో రోడ్డుకు అడ్డంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బుద్ధుడి ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను కట్టారు. అలాగే, రిలే నిరాహార దీక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని కోరగల్లులోనూ నిరసనలు వెల్లువెత్తాయి. స్థానికులు తమ పిల్లాపాపలతో కలిసి రోడ్డుపైకి చేరుకుని బైఠాయించారు. నీరుకొండ కొండవీటి వాగు వద్ద రైతులు ఆందోళనకు దిగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది.