(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై వీడియో ప్రజంటేషన్ చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, దత్తపుత్రుడు, మరియు సతీమణి భువనేశ్వరితో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ మంటలు మండించాలనీ, ఉద్యమాన్ని ఉదృతం చేయాలనీ పిలుపు నిచ్చారని అంబటి విమర్శించారు. దీనికి తోడు వారి అనుకూల మీడియా రాజధాని రగిలిపోతుంది, ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని ప్రపంచానికి చాటి చెప్పేలా చూస్తుందని అన్నారు.
చంద్రబాబు ధర్మపత్ని భువనేశ్వరి ఉద్యమంలో పాల్గొనడమే కాక రైతుల పట్ల ప్రేమ, దయ, జాలి చూపించి బంగారమో లేక ప్లాటినమ్ గాజో విరాళంగా కూడా ఇచ్చారని అంబటి అన్నారు. రాష్ట్రంలో ఇంతకు ముందు అనేక ఉద్యమాలు జరిగాయి, మిర్చి, పత్తి, రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గోదావరి పుష్కరాల్లో 30మంది చనిపోయారు. సమైక్యాంధ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు భువనేశ్వరి బయటకు ఎందుకు రాలేదనీ, వారిపై జాలి ఎందుకు చూపలేదనీ అంబటి ప్రశ్నించారు. రాజధాని రైతుల మీద జాలి, దయ చూపుతున్నారా లేక మీ భర్త చంద్రబాబు, కుమారుడు బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూముల ధరలు పడిపోతాయన్న ఆందోళనతో బయటకు వచ్చారా దీని వెనుక కథ ఏమిటో తేలవలసి ఉందని అంబటి అన్నారు.
రాజధాని ప్రాంతంలో 4,069 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొంటూ వీడియో ప్రజంటేషన్ ద్వారా అంబటి వివరించారు.