(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: విజయనగర సామ్రాజ్యం 350 ఏళ్లు పాలించినా ప్యాలెస్లు లేవని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజమహాల్స్ అవసరం లేదన్నారు. ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రతనేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అబివృద్ధి వికేంద్రీకరణ అవసరమనీ, ప్రణాళిక, అభివృద్ధి కొరకు ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేస్తున్నామనీ బొగ్గన వివరించారు. మూడు, నాలుగు జిల్లాలకొక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 13 జిల్లాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంగా పరిపాలనా వికేంద్రీకరణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
సమాన అభివృద్ధి లేకపోవడం వల్లనే ప్రాంతీయ అసమానతలు వస్తున్నాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ, జిఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూపు నివేదికలోని అంశాలను బొగ్గన వివరించారు.
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం పట్టణాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి నిపుణులతో కమిటీ వేస్తే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి రాజకీయ, వ్యాపారస్తులతో నారాయణ కమిటీ వేసిందని బుగ్గన విమర్శించారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
గతంలో రాజధాని ప్రకటన సమయంలో ఆరు నెలల పాటు డ్రామాలు ఆడారని విమర్శించారు. భావితరాలు మొత్తం నష్టపోయే విధంగా గత ప్రభుత్వం స్కెచ్ వేసిందని ఆయన విమర్శించారు.అయిదేళ్ల పాటు చంద్రబాబు గ్రాఫిక్స్తో మభ్యపెట్టారని బుగ్గన విమర్శించారు. వరద వస్తే 70 శాతం అమరావతి మునిగిపోతుందని అన్నారు. అయిదేళ్లలో 66 వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందనీ, మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో గొప్ప నగరాలు కట్టగలమా అని బుగ్గన ప్రశ్నించారు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్తో బినామీ లావాదేవీలు జరిపి ఓట్ ఆఫ్ సిక్రెసీని ఉల్లంఘించారని బొగ్గన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని కంతేరు గ్రామంలో ఆరు డాకృమెంట్ల ద్వారా చంద్రబాబు నాయుడుకి చెందిన హెరిటేజ్ 14.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని అన్నారు. అదే విధంగా లింగమనేని రమేష్, పరిటాల సునీత, దూళిపాళ నరేంద్ర, మురళీమోహన్, ఆంజనేయులు, లంకా దినకర్, వేమూరి రవికుమార్,బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్ తదితర టిడిపి నేతలు రాజధాని ప్రాంతంలో నాలుగు వేల ఎకరాలకుపైగా ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు.
పద్ధతి పాడు లేకుండా వివిధ సంస్థలకు గత టిడిపి ప్రభుత్వం భూకేటాయింపులు చేసిందని మంత్రి బుగ్గన విమర్శించారు. అమరావతిలో ప్రైవేట్ సంస్థలకు 1300 ఎకరాలు ఇచ్చిందనీ, ఎకరానికి కోటి రూపాయల చొప్పున కేంద్ర సంస్థలకు 60 ఏళ్ల లీజుకు భూములు ఇచ్చిందనీ, కొన్ని బ్యాంకులకు ఎకరానికి నాలుగు కోట్ల రూపాయల చొప్పున భూములుఇచ్చిందన్నారు. 50 లక్షల రూపాయల చొప్పున విట్కు 200 ఎకరాలు, ఎస్ఆర్ఎం వర్సిటీకి 200 ఎకరాలు, అమృత వర్సిటీకి 200 ఎకరాలు, ఇండో యూకే ఆస్పత్రికి 150 ఎకరాలు, మెడ్సిటీకి 100 ఎకరాల భూములు గత ప్రభుత్వం ఇచ్చిందని బుగ్గన తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ల కోసం పీపీపీ మోడల్లో నచ్చినవారికి భూములు ఇచ్చిందనీ, ప్రభుత్వ, లంక భూములు కూడా స్వాహా చేసిందనీ మంత్రి బుగ్గన ఆరోపించారు.
బుగ్గన మాట్లాడుతున్న సమయంలో టిడిపి సభ్యులు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు.