(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశిస్తే… ఎమ్మెల్యే రాపాక మాత్రం పార్టీకి ఝలక్ ఇచ్చారు. తాను మూడు రాజధానుల అంశంపై ఓటింగ్ పెడితే.. అనుకూలంగా ఓటేస్తానని స్పష్టం చేశారు. తన మద్దతు మూడు రాజధానులకేనంటూ తేల్చేశారు. అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
రాపాక వైఖరి జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కొంత ఇబ్బందికరంగా మారింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించాలని రాపాకను పవన్ ఆదేశించినా.. ఆయన పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నిజానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానులకు అంత సుముఖంగా లేరు. ప్రభుత్వం రాజధాని అంశంపై నిర్ణయం తీసుకున్నాక తమ పార్టీ కార్యచరణ ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే ఆందోళనలు చేయడం వల్ల ఉపయోగం లేదని భావించారు. ఇటీవలే బీజేపీ- జనసేన పొత్తు సందర్భంగా రాజధాని తరలింపును తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించాలని రాపాకను పవన్ ఆదేశించారు. అయితే, ఎమ్మెల్యే రాపాక వ్యవహారశైలిని గమనిస్తే పార్టీ అధినేత ఆదేశాలను పాటించే పరిస్థితి కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే.. జనసేన పార్టీ పీఏసీ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించేందుకు సిద్దమయ్యింది. సోమవారం సాయంత్రం కమిటీ భేటీకానుంది.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రాజధాని అంశంపై క్లారిటీ వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాపాక ఎపిసోడ్పై ఈ భేటీలో చర్చిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
కాగా, రాజధాని అంశానికి సంబంధించి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స ప్రవేశపెట్టారు.