అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్ను కోరుతున్నట్లు స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరపాలని కోరే హక్కు మీకు ఎవరిచ్చారని స్పీకర్ను ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సహనం కోల్పోయారు. “అచ్చెన్నాయుడు గారూ మీకు సెన్స్ ఉండాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు హద్దుల్లో ఉండాలని సూచించారు. “డోంట్ టాక్ రబ్బిష్!” అంటూ నిప్పులు చెరిగారు. “విచారణ జరిపించాలని కోరే అధికారం స్పీకర్ కు ఉందో లేదో చెప్పడానికి మీరెవరు ? మీరెవరు నన్ను ప్రశ్నించడానికి ? ఓ విపక్ష సభ్యుడు స్పీకర్ ను ప్రశ్నించడమేంటి ?” అంటూ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. తనకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా లేదా అనేది సభ తేల్చాలన్నారు. తప్పు చేయకుంటే విచారణపై అభ్యంతరం ఎందుకంటూ విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
previous post
next post