అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత 23 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు రైతులకు మద్దతు తెలుపగా.. తాజాగా టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు కూడా మద్దతు తెలిపారు. సినీ నటుడు నారా రోహిత్, సింగర్ స్మిత సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు ప్రకటించారు. రాజధానికోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని ప్రశంసిస్తూ సినీ నటుడు నారా రోహిత్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
“ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను” అని నారా రోహిత్ పేర్కొన్నారు.
ప్రముఖ గాయని, నటి స్మిత కూడా రాజధాని ప్రాంత రైతులకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ‘ఇది చాలా విచారకరం, రాజధాని ప్రాంత రైతుల వేదన చేస్తుంటే గుండె బద్దలవుతోంది. ఆ బాధ తట్టుకోలేనిది. రైతుల పట్ల సానుభూతి చూపించడకుండా, ఎవరికో ఏదో జరిగితే మాకేంటి అకునేవాళ్లను చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. అమరావతి రైతులకు అండగా నేను ఉన్నాను. మీకు న్యాయం జరగాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మీ బాధను పంచుకుంటున్నాను. వాళ్లకు అండగా నిలబడితే ఏమైనా చేయొచ్చు’ అంటూ సింగర్ స్మిత ట్వీట్ చేసింది.
Extremely sad and heartbreaking. It’s very painful to see how many have become so insensitive and don’t care anymore for anything beyond themselves #AmaravathiFarmers I am with you. I am praying for you each day & sharing your pain. WE can make anything happen ?? #UnitedWeStand https://t.co/CCUF5kFVlz
— Smita (@smitapop) January 8, 2020
మరోవైపు అమరావతి పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనలపై రాజధాని ప్రాంతంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి టీడీపీతో పాటు జనసేన, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపడంతో రాజధాని ప్రాంతంలో ఆందోళనలు ఉదృతమయ్యాయి. అయితే, అమరావతి రైతులకు టాలీవుడ్ నటులు మద్దతు తెలపడం లేదని ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్, గాయని స్మిత రైతులకు మద్దతు ప్రకటించడం గమనార్హం.