అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్లో కిషన్ రెడ్డిని కలిశారు. పలువురు మహిళా రైతులు ఉద్వేగానికి గురై తమను కాపాడాలంటూ కిషన్ రెడ్డి కాళ్లు పట్టుకుని మరీ ప్రాధేయపడ్డారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహనరెడ్డి కూడా అమరావతి ప్రాంతాన్ని రాజధానికి అంగీకరించడం వల్లనే తాము భూములను రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి అప్పగించామని వివరించారు. ఎన్నికలకు ముందు కూడా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఇప్పుడు మూడు రాజధానులు అంటూ మాట మారుస్తున్నారని తెలిపారు. పాలకులు మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కోల్పోతుందన్నారు. ఈ సందర్భంగా రైతులు అధైర్యపడవద్దనీ, న్యాయం జరిగేలా చూస్తాననీ కిషన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
అమరావతి రాజధాని ప్రాంతంలోని రైతాంగం గ్రామాల్లో 19 రోజులుగా నిరసన దీక్షలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తూ ఆందోళన ఉదృతం చేస్తున్నాయి. జెఎసిగా ఏర్పడి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వివిధ జిల్లాలలోనూ సేవ్ అమరావతి అంటూ రిలేదీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.