(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో చెలరేగిన వివాదంలో బిజెపి వైఖరి ఇటీవలే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేస వైఖరి స్పష్టం కావడం లేదు. పొత్తు ప్రకటనకు ముందు ఒకసారి. తర్వాత మరోసారి దేశ రాజధాని వెళ్లి బిజెపి నాయకులను కలిసిన జనసేన నేత పవన్ కల్యాణ్ రాజధానిని అమరావతి నుంచి తరలించనిచ్చేది లేదని ప్రకటించారు. ఆయనతో పాటే మీడియతో మాట్లాడిన బిజెపి నాయకులు కూడా ఒకపక్క టిడిపి అదినేత చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శిస్తూనే మరోపక్క రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ వైఖరినే సమర్ధించారు.
అయితే ఆచరణలో ఈ రెండు పార్టీల వైఖరి కాస్త గందరగోళంగా కనబడుతోంది. రాజధాని అమరావతికి మద్దతుగా పిబ్రవరి రెండున నిర్వహిస్తామని ప్రకటించిన లాంగ్మార్చ్ వాయిదా పడిందని శనివారం జనసేన ప్రకటించింది. ఆ కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేయాల్సివచ్చిందీ ఆ ప్రకటనలో వివరించలేదు. జగన్ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాజధాని గ్రామాలలో మహిళలు, పెద్దలు, పిన్నలు రైతులు, కూలీలు 39 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ మధ్యలో ఒకసారి రాజధాని గ్రామాలలో పర్యటించి అక్కడి ప్రజలకు తానున్నానంటూ ధైర్యం చెప్పారు. ఈ లోపు ప్రభుత్వం శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించి రాజధాని బిల్లులు ప్రవేశపెట్టింది. వాటిని మండలి ఛర్మన్ సెలక్టం కమిటీకి పంపడంతో మరో వివాదం రాజుకుంది. తమకు సహకరించని మండలిని రద్దు చేస్తామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఇంత వ్యవహారం జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియదు.
రాజధాని తరలింపు వ్యవహారం ఒకపక్క ముదురుతుండగా బిజెపి, జనసేన పార్టీలు ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉండడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నది. రెండు వారాల తర్వాత ఫిబ్రవరి రెండున ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామనడమే అనుమానాస్పదంగా ఉందనుకుంటే ఇప్పుడు అది కాస్తా నిరవధికంగా వాయిదా పడడం మరిన్ని సందేహాలను మిగిల్చింది.
రాజధాని తరలింపును అడ్డుకుంటామన్న ప్రకటనలకు కట్టుబడే విషయంలో బిజెపి చిత్తశుద్ధిపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు ఒక్కొకరు ఒక్కొక రకంగా మాట్లాడమే కాకుండా ఒక్కొక్క సందర్బంలో ఒక్కోలా మాట్లాడారు. ప్రజలలో ఉన్న అనుమానాలను పోగొట్టేందుకు వారు ఏమాత్రం ప్రయత్నించలేదు. ఇప్పుడు ఆ పార్టీతో కలిసినందుకు పవన కల్యాణ్ విశ్వసనీయత కూడా సందేహాస్పదంగా మారింది. ఆయన అమరావతి పక్షాన ఉన్నాడా లేక ఆవల ఉన్నాడా అన్నది తేలడం లేదు.