(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది. తాజాగా ఆయన మరో వివాదానికి తెర తీశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకుని వేళ్లాడితే జగన్ ప్రభుత్వానికి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించి ఆయన తేనెతుట్టె కదిలించారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాయడం జివిఎల్కు ఆగ్రహం తెప్పించింది. జగన్ చర్యను ఆయన దుర్మార్గంగా అభివర్ణించారు. చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని జగన్ను హెచ్చరించడం రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. 151 మంది శాసనసభ్యుల బలంతో సర్కారు నడుపుతున్న సిఎంను ఇంత బరి తెగించి హెచ్చరించడం దేనికి సంకేతం అని చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపధ్యంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం తమ పరిధిలోనే లేదనీ, దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చనీ 15వ ఆర్ధిక సంఘం నివేదికలో స్పష్టం చేసిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తూ విజయసాయి రెడ్డి, వాస్తవం ఇలాఉండగా కేంద్రమంత్రులు సభను తప్పు దోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.
నిజానికి ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాసింది కూడా 15వ ఆర్ధిక సంఘం నివేదిక కారణంగానే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వకపోవడానికి 14వ ఆర్ధిక సంఘం నివేదిక అనుమతించడం లేదని ఇన్నాళ్లూ బిజిపి మంత్రులూ, నేతలూ చెబుతూవచ్చారు. తాము అలాంటి సిఫారసు ఏమీ చేయలేదు మొర్రో అని ఆ ఆర్ధిక సంఘం సభ్యులు వివరించినా బిజిపి వారు ఆ బుకాయింపును విడిచిపెట్టలేదు. ఇప్పుడు 15వ ఆర్ధికసంఘం విషయం స్పష్టం చేసింది కాబట్టి ప్రత్యేకహోదా అంశం మరోసారి తెర పైకి వచ్చింది. జగన్ లేఖ రాసినందుకే బెదిరింపులకు దిగిన జివిఎల్ ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడినందుకు ఏమంటారో చూడాలి.