(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ నుంచి మనోజ్ జాతో పాటు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజల్లో ఎలాంటి పరిస్థితులన్ని ఎదుర్కొంటున్నారనే విషయాలపై అక్కడి ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. సమస్యాత్మకంగా ఉన్న శ్రీనగర్ ప్రాంతంలోనూ పర్యటించాలని నేతలు భావిస్తున్నారు.
మరోవైపు విపక్ష నేతల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోయలో శాంతి, భద్రతల పునరుద్ధరణ కొనసాగుతున్న వేళ సీనియర్ నాయకులు ఇక్కడ పర్యటించే ప్రయత్నం చెయ్యొద్దని కోరింది. అలాగే అనేక ప్రాంతాల్లో ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తాజా పర్యటన నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని కోరింది. ఉగ్రవాదం నుంచి ప్రజల్ని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ఇదిఇలా ఉంటే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజలు సాధారణ జీవనాన్ని కొనసాగించలేకపోతున్నారని, సైనిక బలగాల మోహరింపుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాను ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తానని గతంలో రాహుల్ చెప్పారు. దీనిపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ.. రాహుల్ వస్తానంటే విమానాన్ని కూడా పంపిస్తానని అన్నారు. మరోవైపు రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస నేత గులాంనబీ ఆజాద్, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి లను ఇదివరకు పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. అయితే ఈ రోజు రాహుల్ నేతృత్వంలోని ఈ బృందం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
https://twitter.com/diprjk/status/1164919353290002434