అమరావతి: రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’ వాయిదా పడింది. లాంగ్మార్చ్ను వాయిదా వేసుకున్నట్లు బీజేపీ నేత తురగా నాగభూషణం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
అమరావతి నుంచి రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీ – జనసేన నేతలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం రాష్ట్ర పరిస్థితులపై ఇకపై ఏ కార్యక్రమాలు నిర్వహించినా..ఇరు పార్టీలు కలిసే చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఆ భేటీలోనే ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ చేయాలని నిర్ణయించారు. అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అయితే, ఇప్పుడు అది వాయిదాపడినట్టు బీజేపీ ప్రకటించింది. జనసేన నుంచి అధికారికంగా ఈ ప్రకటన వెలువడలేదు. అయితే, లాంగ్ మార్చ్ వాయిదా పడడానికి కారణం ఏంటి? మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే ఆసక్తి నెలకొంది.