తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపి చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిని రాజధానిగా చేయాలని 2013లోనే తాను నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.
రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారనుందని ఢిల్లీలోని పెద్దల ద్వారా తనకు సమాచారం ఉందని చెప్పారు. ఎలాంటి సౌకర్యాలు లేని దొనకొండ కంటే తిరుపతి కొండ అయితే రాజధానికి బాగుంటుందని ఆయన అన్నారు. దొనకొండలో జలవనరులు, రైల్వే మార్గం, రవాణా సౌకర్యాలు, విద్యా, వైద్య సంస్థలు లేవని చింతా పేర్కొన్నారు. రాజధాని మార్పుపై వైసిపి ప్రభుత్వం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడినట్లు తెలిసిందని చింతా అన్నారు. దొనకొండ విషయంలో తొందరపడవద్దని సిఎం జగన్కు ఆయన సూచించారు. తిరుపతి కాకుండా రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసినా నిలబడదని చింతా పేర్కొన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మంగళవారం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని కట్టవద్దని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కూడా కృష్ణా వరదను బూచిగా చూపి ప్రభుత్వం రాజధానిని అమరావతి నుండి మార్చాలని చూస్తోందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సిఎం జగన్మోహనరెడ్డి రాజధాని విషయంపై స్పష్టమైన ప్రకటన ఏదీ ఇంత వరకూ చేయలేదు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో రాజధానిపై అడిగిన ప్రశ్నకు సిఎం స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా రాజధాని భూసేకరణ విషయంలో గత ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడిందనీ దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. రాజధానిపై మళ్లీ ఊహగానాలు రావడంతో రాయలసీమలోని కర్నూలు జిల్లా నాయకులు తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాలంగా డిమాండ్ చేస్తున్నామని ఆ ప్రాంత నేతలు పేర్కొంటున్నారు. తమిళనాడు నుండి ఆంధ్రరాష్ట్రం విడిపోయిన తరువాత తొలి సారిగా కర్నూలు కేంద్రంగా రాజధాని ఏర్పడిన విషయం తెలిసిందే.