(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: కాకినాడలో జనసైనికులపై జరిగిన ఘటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడకే వచ్చి తేల్చుకుంటానంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. కాకినాడలో జరిగిన సంఘటనకి పోలీసు శాఖ వారు అసలైన కారకులైన వైసిపి నాయకులను వదిలివేసి, జనసేన నాయకులు మీద అన్యాయంగా ఐసిపి సెక్షన్ 307 పెడితే చూస్తూ ఊరుకుంటామా, ఢిల్లీలో మీటింగ్ ముగించుకొని నేరుగా కాకినాడకే వస్తా అక్కడే తేల్చుకుంటాము అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాకినాడ వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు నిన్న ఆయన ఇంటి ముట్టడికి పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. పట్టణంలో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే నివాసానికి వెళుతుండగా వైసిపి కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీనికి ప్రతిగా జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో పోలీసులు పలువురు జనసేన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రాళ్లదాడిలో పలువురు జనసేన కర్యకర్తలు గాయపడ్డారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడి జరిగిన ఘటనలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దు, అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానం అని పేర్కొన్నారు. సభ్య సమాజం చీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియజేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసిపి కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరమని అని పేర్కొన్నారు. ప్రజలచే ఎన్నికైన ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారన్నారు. పోలీసులు పక్షపాతం లేకుండా ఇరువర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కార్యకర్తలకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుండి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటానని పవన్ తెలిపారు. రాళ్ల దాడిలో గాయపడిన జనసేనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షించారు.
ఈ రోజు కాకినాడ లో జరిగిన సంఘటన కి పోలీస్ శాఖ వారు,అసలు కారకులైన వైసీపీ నాయకులని వదిలేసి , జనసేన నాయకులూ మీద అన్యాయంగా IPC సెక్షన్ 307 పెడితే,
నేను ఢిల్లీ మీటింగ్ ముగించుకొని , నేరుగా కాకినాడకే వస్తాను, అక్కడే తేల్చుకుంటాము.— Pawan Kalyan (@PawanKalyan) January 12, 2020