గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. బెయిల్ పత్రాలు గుంటూరు సబ్ జైలు అధికారులకు అందిస్తామని, ఆపై సాయంత్రంలోగా గల్లా విడుదల అవుతారని ఆయన తరఫు న్యాయవాదలు తెలిపారు.
ఏపీకి మూడు మార్చడంపై సోమవారం(జనవరి 20) అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని పాల్గొన్న గల్లా జయదేవ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును పోలీసులు నమోదు చేశారు. మంగళగిరి మేజిస్ట్రేట్ బెయిల్ నిరాకరించడంతో పోలీసులు ఆయనను తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించారు.
ఎంపీ గల్లా జయదేవ్ అరెస్ట్తో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన జయదేవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత జయదేవ్ను దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రొంపిచర్ల పోలీస్స్టేషన్ నుంచి గుంటూరుకు తీసుకువచ్చి అర్ధరాత్రి వరకు పోలీసుల వాహనంలోనే కూర్చోబెట్టారు. గల్లా జయదేవ్ అరెస్ట్ గురించి తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు,అనుచరులు.. ఆయన్ను తరలిస్తున్నా కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్ వైద్యులతో జయదేవ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు హైడ్రామా కొనసాగింది. గల్లాను వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి మూడు గంటలకు మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. బెయిల్ కోసం ప్రయత్నించగా.. మంగళగిరి మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఎంపీ గల్లాకి జనవరి 31వరకు రిమాండ్ విధించడంతో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు గుంటూరు సబ్ జైలుకి తరలించారు.