(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
శ్రీకాకుళం:విశాఖ రాజధాని ప్రకటన లేకుండానే ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించడం తగదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో చర్చ మాత్రమే జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమేనని అన్నారు. విశాఖలో భూ ఆక్రమాలపై సిట్ విచారణలో టిడిపి అక్రమాలు బయటపడ్డాయని బొత్స పేర్కొన్నారు. రాజధానిపై హైపవర్ కమిటీ నివేదిక బట్టి స్పష్టత వస్తుందని ఆయన అన్నారు.
అసెంబ్లీలో జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నేపథ్యంలో విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు అవుతోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి బాహాటంగానే ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడకముందే విజయసాయిరెడ్డి ప్రకటన చేయడంతో టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో సహా పలువురు టిడిపి నేతలు విశాఖలో వైసిపి నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడంతో పాటు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ ప్రాంతంలో జరిగిన భూముల కొనుగోళ్లపై విచారణకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో బొత్స టిడిపి నేతల ఆరోపణలను ఖండిస్తూ అసలు ఇంకా విశాఖ రాజధానిగా ప్రకటన వెలువడలేదని చెప్పుకొచ్చారు.