(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీకి మూడు రాజధానులపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కదిరి వైసీపీ ఎమ్మెల్యే పీవీ సిద్దా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు ఒక్కటే సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూలులో హైకోర్టుతో పాటు బాగా వెనకబడిన ప్రాంతమైన అనంతపురంలో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వింటర్ అసెంబ్లీ అయినా ఏర్పాటు చేసి.. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అనంతపురంలో నిర్వహించాలని ఆయన కోరారు. రాజధాని విషయంలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం పేరుతో కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్కు తరలించారని సిద్దారెడ్డి అన్నారు. అన్ని విధాలా హైదరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడం.. రాష్ట్ర విభజన జరిగిపోయాయని సిద్దారెడ్డి అన్నారు. విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క అమరావతిలోనే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిగిలిన ప్రాంతాలను దుర్భిక్ష పరిస్థితుల్లోకి నెట్టివేయడం మంచి పద్ధతి కాదని సిద్దారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి పరిస్థితి పునరావృతం కాకూడదని సిద్దారెడ్డి చెప్పారు.
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి ప్రాంత రైతులు భగ్గుమన్నారు. గత రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. రాజధానిగా అమరావతే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.