అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్పి ఖండించారు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్ని బ్రేక్ చేసినందుకు పవన్పై పోలీసులు కేసు నమోదు చేయనున్నాన్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని చెప్పారు. ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంగళవారం(డిసెంబర్ 31) అమరావతిలో పర్యటన సందర్భంగా.. పవన్ మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున.. మందడానికి పవన్ వెళ్లేందుకు.. పోలీసులు నిరాకరించారు. తుళ్లూరు వెళ్లాలని పవన్కు సూచించారు. దీంతో.. పవన్ కారు దిగి మందడానికి నడుచుకుంటూ వెళ్లారు. అయితే, మందడం వైపు నడుచుకుని వెళ్తోన్న పవన్ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నందున పావు గంట పాదయాత్ర ఆపాలని పవన్ను కోరారు. దీంతో వెంకటాపాలెం వద్ద రోడ్డుపై బైటాయించారు. మరోసారి మందడం శివార్లలో పవన్ను పోలీసులు అడ్డుకోవడంతో.. జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పవన్ నేలపైన కూర్చొని పోలీసుల తీరుకు నిరసనకు దిగారు. రోడ్డుపైనే పవన్ ధర్నా నిర్వహించారు. అనంతరం కాలినకడన రాజధాని గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.