న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరం 106 రోజులు శిక్ష అనుభవించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 106 రోజుల తర్వాత తనకు స్వేచ్ఛ లభించిందని చిదంబరం పేర్కొన్నారు. చిదంబరం రాజ్యసభకు హాజరవడం హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ బీజేపీపై విమర్శల చేసే చిదంబరం.. రాజ్యసభ సమావేశాల్లోనూ అదే వాడి వేడిని కొనసాగిస్తారా? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
బుధవారం జైలు నుంచి విడుదలైన చిదంబరం.. సోనియా గాంధీని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఎన్ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది అగస్టు 21న సీబీఐ చిదంబరంను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 16న ఈడీ కూడా అదుపులోకి తీసుకుంది. అనంతరం తీహార్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇదే క్రమంలో సీబీఐ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఈడీ కేసు కూడా వెంటాడుతుండటంతో జైలు నుంచి విడుదల కాలేకపోయారు. అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు చిదంబరానికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును అశ్రయించగా బెయిల్ వచ్చింది.