గుంటూరు: తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు. రాజధాని రైతులు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నా రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై మంత్రులు రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం రైతులు మధ్య చిచ్చుపెట్టవద్దని అన్నారు. రాజధానిని అభివృద్ధి చేయాలన్నదే ఈ ప్రాంత రైతులందరి ఏకైక డిమాండ్ అన్నారు.
చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడం కోసం రాజధానిని వాడుకోవద్దని చెప్పారు. రైతులకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. రైతులందరం ఒకే మాటగా ఉన్నామని పేర్కొన్నారు. రైతుల కోసం టిడిపి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పోటీగా వైసిపి నేతలు సమావేశం పెట్టారని అన్నారు. రెండు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యేని రాజకీయాలకు అతీతంగా అందరం రైతులు కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని కోరితే రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంత వరకూ ఏర్పాటు చేయలేదనీ, నేడు టిడిపి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంటే పోటీగా రైతులతో సమావేశం అంటూ పిలుపు ఇచ్చారనీ, ఈ సమావేశానికి రాజధాని రైతులకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
ఇప్పటికైనా మంత్రులు రాజధాని రైతుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి స్పష్టమైన ప్రకటన ఇప్పించాలని డిమాండ్ చేశారు. భూసేకరణలో కుంభకోణాలు జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదని రైతులు ప్రశ్నించారు. రాజధాని రైతులకు ఎవరూ లేరనుకుంటున్నారేమో, శంకుస్థాపన చేసిన ప్రధాని మోది, కేంద్ర మంత్రి అమిత్ షా, తమకు మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర రాజకీయ పార్టీల నేతల మద్దతు ఉందని వారు స్పష్టం చేశారు.