(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉందనీ, ఈ దశాబ్దం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమనీ అన్నారు. గత సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించి చరిత్ర సృష్టించిందనీ, అంతా కలిసి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చామన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కొత్త బిల్లులను కూడా తీసుకొచ్చామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమనీ, రాజ్యంగ ప్రకారమే ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. కశ్మీర్ అభివృద్ధి బాట పట్టిందన్నారు. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగానే ప్రభుత్వం కొత్త పథకాలు, కొత్త చట్టాలు తీసుకువచ్చిందన తెలిపారు.రామజన్మభూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజలు చూపిన ఔన్నత్యం ప్రశంసనీయమని రాష్ట్రపతి కొనియాడారు.
విపక్షాల నిరసన
పారసత్వ సవరణ చట్టం గురించి రాష్ట్రపతి ప్రస్తావిస్తూ అందరికీ సమాన హక్కులు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. సిఏఏతో గాంధీజీ కలలు నిజమయ్యాయని అన్నారు. నిరసనల పేరుతో హింసకు పాల్పడటం తగదన్నారు. సమజాన్ని, ప్రజాస్వామ్యాన్ని హింస బలహీన పరుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేయగా విపక్షాలు సిగ్గు సిగ్గు అంటూ నిరసన వ్యక్తం చేశారు.