(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్: చెదురు మదురు సంఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ల బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటర్ల గుర్తించేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. కొంపల్లిలోని పది పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఫేస్ రికగ్నేషన్ యాప్ను ఉపయోగిస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు వారివారి పరిధిలోని పోలింగ్ బూత్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గంజిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఎంఐఎం నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో కాంగ్రెస్ నేత శంకర్ గాయపడగా పోలీసులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లాఠీ చార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పది మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు డిచ్పల్లి నుండి వచ్చారన్న సమాచారంతో సమాచారంతో వీరిని ఏస్సీ కాలనీ వద్ద అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కామారెడ్డి పరిధిలోని ఎల్చిపూర్లో ముక్కుపుడకలు పంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ముక్కుపుడకలు పంచిపెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 41వ వార్డులో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వివాదం నెలకొన్నది.
పోలింగ్ బూత్ వద్ద వంద మీటర్ల నిబంధనను అధికార పార్టీ కార్యకర్తలు ఉల్లంఘించడంతో ఉద్రిక్తత నెలకొన్నది. మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో నకిలీ ఓటరు కార్డులతో దొంగ ఓటు వేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించగా కాంగ్రెస్ నేతలు గుర్తించారు. ఆ ఇద్దరిని పట్టుకుని చితకబాదారు. వరంగల్లు జిల్లా వర్థన్నపేట జిసి తండా ఆరవ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బోడుప్పల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఇరువర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతున్నారని టిఆర్ఎస్ అభ్యర్థి రమేష్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ఇలా పలు పోలింగ్ బూత్ల వద్ద చిన్న ఘర్షణలు చోటుచేసుకున్నారు.
గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న మణికొండ కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇక్కడ మండల పరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మణికొండకు ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రముఖ వ్యాపారస్తులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు మణికొండలోనే ఉంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 120 మునిసిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో పోలింగ్ సాయంత్రం అయిదు గంటల వరకూ జరగనుంది. ఒక్క కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఈ నెల 24న పోలింగ్ నిర్వహించనున్నారు.