(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ నీరజ (31) తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న నీరజ.. సమ్మె విషయంలో ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరితో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం పల్లెగూడెంలోని తన పుట్టింటికి వెళ్లారు. సోమవారం కలెక్టరేట్ల ఎదుట చేపట్టనున్న ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొనాల్సి ఉందని చెప్పి తిరిగి ఖమ్మం చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కండక్టర్ నీరజ ఆత్మహత్య వార్త తెలుసుకున్న కార్మికులు, నేతలు పెద్దసంఖ్యలో ఆమె నివాసానికి చేరుకున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటంతో సత్తుపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సత్తుపల్లి డిపో వద్ద కార్మికులు, అఖిల పక్ష నేతలు ఆందోళన చేపట్టారు. వాహనాలను అడ్డుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె మొదలైన తర్వాత చనిపోయిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య తాజా ఘటనతో 13కు చేరుకుంది. వీరిలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడగా, పది మంది గుండెపోటుతో ప్రాణాలొదిలారు. ఖమ్మం జిల్లాకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి తొలి ఆత్మ బలిదానం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలతో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అక్టోబర్ 12వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇటివల ఆర్టీసీ విలీనం ప్రస్తావన లేకుండా ఆర్థిక భారంలేని అంశాలపై కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో రెండు రోజుల క్రితం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం 21 డిమాండ్లపై చర్చలకు సిద్దం కాగా.. కార్మిక నేతలు మాత్రం మొత్తం 46 డిమాండ్లపై చర్చలు జరపాలని పట్టుబడ్డారు. నేతల డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య చర్చలు విఫలమయ్యాయి.
మరోవైపు ఆర్టీసీ అద్దె బస్సులు పెంపు కోసం మరిన్ని నోటిఫికేషన్లు జారీచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు మరింత వేగవంతం చేస్తూనే, ప్రైవేట్ రూట్లపై సర్వే నిర్వహించాలని తెలిపారు. ప్రైవేటు రూట్లు, బస్సుల విధి విధానాలపై కసరత్తు చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు చూస్తుంటే ఆర్టీసీ కార్మిక సంఘాలతో రాజీ పడేది లేదని అర్థమవుతోంది. జేఏసీ నేతలు చర్చల మధ్యలోనే వెళ్లిపోయారని అధికారులు ఇచ్చిన నివేదికతో కేసీఆర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు 26 డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరింది. రోజుకో నిరసన కార్యక్రమం చేపడుతున్న కార్మికులు.. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని చెబుతున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి మంచిది కాదని సూచిస్తున్నారు.