అమరావతి : తమ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. భావితరాలకు మంచి జరగాలనే ఆలోచనతోనే సీఎం జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలుగు భాషపై టీడీపీ నాయకులకే ప్రేమ ఉన్నట్టు మాట్టాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వంపై కొందరు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ఇంగ్లీషు మీడియం పెడితే.. తెలుగు భాష మీద ప్రేమలేనట్టు కాదన్నారు. తెలుగు భాష తల్లిలాంటిదని, తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. తెలుగు భాషను విస్మరిస్తున్నారంటూ కొందరు కక్షపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. తెలుగు రచయితల సంఘం మహాసభలు జరగటం కొత్త ఏమీ కాదని అంబటి రాంబాబు అన్నారు. 2007, 2008, 2015లో తెలుగు మహాసభలు జరిగాయని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు నాల్గోసారి మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయని అంబటి తెలిపారు. దీనికి మంచి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తెలుగు భాష మీద అందరికీ మమకారం ఉంటుందన్నారు. ప్రపంచం తెలుగు రచయితల సభ జరిగిన తీరు, కొంతమంది మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం జరుగుతున్న వేదికపై.. టీడీపీ నేతలు పచ్చ కండువాలు తీసి తెల్ల కండువాలు వేసుకొని కనిపించారని పేర్కొన్నారు. కొందరు మాట్లాడిన మాటలు చూస్తే వారికి మాత్రమే తెలుగు మీద ప్రేమ ఉన్నట్లు మిగతా వారికి ప్రేమలేనట్లు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుగు అంటే గౌరవం లేనట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్ణయం తెలుగు భాషను బహిష్కరించినట్లు, తెలుగు భాషను రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు భాష ఎవ్వరూ చదువుకోవటానికి వీల్లేదన్నట్లు కొంతమంది చిత్రకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఎదగాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి అని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారు వారి పిల్లలను ఏ మీడియంలో చదివించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీషులో చదువుకోకూడదా? ప్రశ్నించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ఖచ్చితంగా ప్రవేశపెడుతామని అంబటి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసినా కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.