(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్ ఇవ్వాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. షోకాజ్ నోటీసుకు వివరణ సంతృప్తిగా లేకపోతే ఆయన్ను సస్సెండ్ చేయాలని నేతలకు సీఎం సూచించినట్లు సమాచారం. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తే వేటు తప్పదని సీఎం జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఆనం లాంటి సీనియర్ నాయకుడికి షోకాజ్ ఇవ్వడంపై వైసీపీ నేతల్లో పెను కలకలం సృష్టిస్తోంది. వైసీపీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని, ఆనం అసంతృప్తితో ఉన్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, సొంతపార్టీపైనే వ్యాఖ్యలు చేసిన ఫలితంగా ఆయనపై పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాగా, నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందని ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని, లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలి.. ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వెళ్లాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా నెల్లూరు నగర ప్రజలు చెప్పుకోలేక అల్లాడిపోతున్నారని తెలిపారు. ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరంతో పనిచేసే పోలీస్ అధికారులు ఉన్నా.. ఒకడుగు ముందుకు వేయాలంటే.. వెనక్కు తిరిగి వాళ్ల ఉద్యోగ భద్రతను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులకు చేస్తామని నమ్మకం ఉన్నా.. చేయలేని పరిస్థితి ఉందన్నారు.