అమరావతి: ఏపీ రాజధాని అంశమై ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేయనుంది. అసెంబ్లీ, కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలు.. హైపవర్ కమిటీ అధ్యయనం చేసిన అంశాలపై ప్రాధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ దిశగా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ కూడా వికేంద్రీకరణకు మద్దతుగానే నివేదిక అందజేసినట్లు సమాచారం. అమరావతి నిర్మాణానికి నిధుల లేమి.. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే హైపవర్ కమిటీ వికేంద్రీకరణకు అనుగుణంగా నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది.
కేబినేట్ భేటీ అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కేబినెట్లో ఆమోదించిన అంశాలకు సంబంధించి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిల్లు ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఇప్పటికే అత్యంత గోప్యంగా ప్రభుత్వం పనులు చక్కబెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలకు సైతం విప్ జరీ చేసే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అమరావతి పరిధిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సచివాలయం, అసెంబ్లీకి వెళ్లేదారుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్ నివాసం నుంచి అసెంబ్లీకి వెళ్లే దారిలో భారీగా పోలీసులను మోహరించారు.
మూడు రాజధానుల వ్యవహారంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులను రాజధాని గ్రామాల్లో మోహరించారు. విజయవాడ నుంచి సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే దారుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ప్రయాణించే మార్గంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించారు. కీలకమైన కూడళ్లలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వాత్ర టెన్షన్ నెలకొంది.