(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: శాసనమండలిని రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. శాసనమండలి రద్దు యోచనపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. టిడిపి ఎమ్మెల్సీలపై సీఎం జగన్ ప్రలోభాలు పనిచేయలేదనీ, వైసిపి నేతల బెదిరింపులు, అక్రమ కేసులకు ఎమ్మెల్సీలు లొంగలేదనీ యనమల అన్నారు. ఈ మూడు రోజుల్లో ప్రలోభాలు పనిచేయకపోవడంతో వైసిపి అక్కసు రెట్టింపు అయ్యిందని విమర్శించారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా టిడిపి ఎమ్మెల్సీలంతా దృఢంగా నిలబడ్డారని పేర్కొన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను రద్దు చేయడం జగన్ అనుకున్నంత సులభం కాదని యనమల అన్నారు. ఒక నిర్మాణాత్మక పంథాలో కౌన్సిల్ ఏర్పడిందన్నారు. శాసనమండలిని రద్దు చేయడం ప్రజా వేదిక కూల్చినంత సులభం కాదని అన్నారు.
శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం ఆమోదించినా అది అమల్లోకి రావాలంటే రెండు మూడేళ్లు పడుతుందనీ, అప్పటి వరకూ శాసనమండలి కొనసాగుతూనే ఉంటుందనీ ఆయన స్పష్టం చేశారు.
2021 నాటికి శాసనమండలిలో వైసిపికి మెజారిటి వస్తుందని చెబుతూ అలాంటప్పుడు కౌన్సిల్ రద్దు అవసరం ఏముందని ప్రశ్నించారు. కౌన్సిల్లో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపడం జరిగిందనీ, వాటిపై నిర్ణయాలకు కనీసం రెండు, మూడు నెలలు పడుతుందనీ ఆయన అన్నారు. అయినప్పటికీ శాసనమండలి రద్దు చేస్తామనడం జగన్ మొండితనమే అవుతుందని ఆయన విమర్శించారు. జగన్ తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరించడం సరైంది కాదని యనమల అన్నారు.