లక్నో: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘటనకు నిరసనగా శనివారం లక్నోలోని అసెంబ్లీ భవనం ముందు ఆయన ధర్నా చేశారు. ఉన్నావ్ రేప్ ఘటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది నిజంగా బ్లాక్ డే అన్నారు. ఆడపిల్ల జీవితాన్ని ప్రభుత్వం రక్షించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్, డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్ ఘటనకు నిరసనగా ఆదివారం రాష్ట్రమంతా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
డిసెంబర్ 5వ తేదీ ఉన్నావ్ బాధితులరాలు కోర్టు విచారణ కోసం రాయ్ బరేలీ వెళ్లేందుకు బయలుదేరగా.. ఐదుగురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో కొనఊపిరితో ఉన్న యువతిని మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ, సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం(డిసెంబర్ 6) రాత్రి కన్నుమూసింది. ఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.