(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విజయవాడ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో సహా పోలీసులు అరెస్టు చేసిన టిడిపి నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) పిలుపు మేరకు పెదకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమానికి బయలుదేరిన నారా లోకేష్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు అరెస్టు చేసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైవిబి రాజేంద్రప్రసాద్ పోలీసుల నుండి తప్పించుకుని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకొని నారా లోకేష్, ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు.