అమరావతి: చినకాకాని వద్ద రైతుల ముసుగులో టీడీపీకి చెందిన వ్యక్తులే తనపై దాడి చేశారని వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై ఆందోళనకారులు దాడి చేశారు. కారు అద్దాలను పగలగొట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసుల అండతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఈ ఘటనపై పిన్నెల్లి మాట్లాడుతూ తాను విజయవాడకు వెళ్తున్న సమయంలో 50 మంది మద్యం తాగి వచ్చారని, తన వాహనం ముందుకు వెళ్లకుండా, వెనక్కి వెళ్లకుండా రెండు కార్లు అడ్డం పెట్టారని తెలిపారు. ప్రశ్నించిన తమ గన్ మెన్లపై కూడా దాడి చేశారని, కారు అద్దాలు పగలగొట్టారని చెప్పారు. ఇది రాజధాని రైతులు చేసిన దాడి కాదని… టీడీపీ వారు చేసిన పనేనని ఆరోపించారు. రైతులపై తమకు సానుభూతి ఉందని, రాజధాని రైతులు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని, చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చని పిన్నెల్లి సూచించారు. తన కారుపై రాళ్లు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. తన కారుపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన పని అని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే చంద్రబాబు ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులు కాకుండా… చేతనైతే తమపై డైరెక్టుగా దాడులు చేయాలని సవాల్ విసిరారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గుండాగిరీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తానని పిన్నెల్లి చెప్పారు.
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుని అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కొందరు రాళ్లతో కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది పైనా చేయి చేసుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు రంగంలోకి దిగే ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు.