(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టిడిపి అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంపై టిడిపి దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల అనంతరం మరోలా రాజధానిపై ఈనాడు దిన పత్రిక రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు సమాజం కోసం కాకుండా తమ సామాజిక వర్గం కోసం పని చేస్తున్నాయని బొత్స విమర్శించారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలుసునని అన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవ్వరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తాత్కాలిక భవనాలే కట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వానికి అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాజీపడమని అన్నారు.
రాజధాని రైతులకు చిత్తశుద్ధితో న్యాయం చేస్తామని బొత్స పెర్కొన్నారు. చంద్రబాబు ఉచ్చులో రాజధాని రైతులు పడకుండా వారికి ఏమి న్యాయం కావాలో ప్రభుత్వానికి చెప్పాలని సూచించారు. చంద్రబాబు బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వైసిపి ప్రభుత్వం భయపడదని బొత్స అన్నారు. అన్ని కమిటీల నివేదికలు పరిశీలన తర్వాతే రాజధానిపై నిర్ణయం తీసుకుంటామనీ, అన్ని అంశాలు అసెంబ్లీలో చర్చిస్తామనీ తెలిపారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదే అమలు చేస్తామనీ, ఒక వేళ రైతులు ఆలోచన మార్చుకుంటే వారితో చర్చిస్తామనీ బొత్స తెలిపారు.