అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన తనను కలచివేసిందన్నారు. దిశ హంతకులను కాల్చిచంపినా తప్పులేదని తనకు కూడా అనిపించిందని చెప్పారు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు హ్యాట్సాఫ్ అంటూ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యానించారు.
‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్ గారూ.. తెలంగాణ పోలీసులు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. ఇదే సినిమాల్లో దోషులను చంపితే చెప్పట్లు కొడతారు. నిజ జీవితంలో దమ్మున్న వారు ఎవరైనా ఇలాంటి పని చేస్తే మానవ హక్కుల కమిషన్ అట ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయి. నాలుగు నెలల్లో తీర్పు నిచ్చి, శిక్ష వేయాలని నిర్భయ చట్టం చెబుతోంది. ఈ రోజుకి కూడా నిర్భయ దోషులకు శిక్ష పడలేదు. ఏపీలో ఆడపిల్లలకు భద్రతపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులను కాల్చేయాలని ఎవరూ అనుకోరు. కానీ, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా న్యాయం జరగడంతో జాప్యం జరగుతుందని అనిపిస్తే మాత్రం ప్రజల్లో ఆగ్రహం తన్నుకొస్తుంది’ అని జగన్ పేర్కొన్నారు.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని సీఎం జగన్ ఆరోపించారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరికీ అన్యాయం జరకుండా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరితగతిన న్యాయం జరగాలంటే చట్టాలు మారాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.