అమరావతి: చైనాలో విజృంభిస్తున్న ‘కరోనా వైరస్’ తాజాగా ఏపీకి వ్యాప్తించినట్లు తెలుస్తోంది. చైనా నుండి కృష్ణా జిల్లా అవనిగడ్డకు వచ్చిన ఓ యువ డాక్టర్కు కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతోన్న మెడికో స్వస్థలమైన అవనిగడ్డకు వచ్చాడు. దీంతో జిల్లా వైద్యాధికారులు ఫోకస్ పెంచారు. మెడికోకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా వైరస్ సోకిందా ?లేదా ? అన్నది మాత్రం పరీక్షల రిపోర్టు వస్తే కానీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. దీంతో ఆ మెడికోను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.
మరోవైపు ‘కరోనా వైరస్’ వ్యాప్తిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. చైనా నుంచి ఏపీకి వస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ మధ్య రాష్ట్రంలోని కాకినాడ, రాయచోటి, అవనిగడ్డ, కర్నూలు ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు చైనా నుంచి ఇక్కడికి వచ్చారని భారత దౌత్య కార్యాలయం ద్వారా వచ్చిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చేరవేసింది. దీంతో ఆయా ప్రాంతలకు చెందిన వారి ఇళ్లకు వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహించాయి. కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని వైద్యు బృందాలు నిర్ధరించాయి. అయితే, వీరి ఆరోగ్య స్థితిని మరికొన్ని రోజులపాటు నిశితంగా గమనించనున్నారు. కరోనా వైరస్ ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఆసుపత్రుల్లో ఐదు ప్రత్యేక పడకలు సిద్ధం చేశారు.