(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలోని ఎనిమిది గ్రామ పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయా గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతూరు గ్రామ పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో కలుపుతూ పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వం రాజధాని ప్రాంతంలోని గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రభుత్వం మాత్రం ఈ గ్రామాల సత్వర అభివృద్ధి కోసమే రాజధాని పరిధి నుంచి తొలగించి మున్సిపాలిటీల్లో చేర్చామని చెబుతున్నారు