అమరావతి: ఏపిలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా విద్యుత్ చార్జీల పెంపుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.ఈ నెల తొమ్మిదిన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో, 10న కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో, 11న తిరుపతి ఎస్పిడిసిఎల్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపిఎస్పిడీసిఎల్ సిఎండి హెచ్ హరనాథరావు తెలియజేశారు.
అయా రోజుల్లో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి రెండు గంటల నుండి నాలుగున్నర గంటల వరకూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎండి వెల్లడించారు.