అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు తప్పుబడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజశేఖరరెడ్డి పాదయాత్రలో గానీ, జగన్ పాదయాత్రలో గానీ అరెస్టులు జరిగాయా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసే సంస్కృతి లేదని అశోక్ గజపతిరాజు అన్నారు. జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసిందని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయన్నారు. శ్రీనగర్లో ఉన్న పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అన్యాయమని అన్నారు.పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఆపడం దుర్మార్ఘమని పేర్కొన్నారు. రాజధాని భూములను తిరిగి ఇచ్చేస్తామనడం ఆశ్చర్యానికి గురి చేస్తోందనీ, ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుని రివర్స్ గేర్లో నడుస్తున్న ప్రభుత్వం ఇది అని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ఆపేసి విశాఖకు నీరు ఎలా తెస్తారని ప్రశ్నించారు.
రాజధాని ప్రాంతాన్ని ఎడారి అని ఒకరు, శ్మశానం అంటూ మరొకరు పోలుస్తూ మాట్లాడటం దుర్మార్ఘమని అన్నారు. రాజధాని అనేది ఒక రాజకీయ పార్టీ సమస్య కాదనీ, రాష్ట్రానికి సంబంధించిన సమస్య అనీ అన్నారు. రాజధాని కోసం ప్రజలంతా బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.