అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ప్రభుత్వ చర్యలు కనబడుతున్నాయి. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అనే అభిప్రాయ సేకరణకు మాజీ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ కమిటీ ఆదివారం కర్నూలు వెళ్లినపుడు, కర్నూలు జిల్లా కేంద్రానికి 15 నుండి 20 కిలో మీటర్ల దూరంలో విమానాశ్రయానికి సమీపంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని అక్కడి జిల్లా అధికారులకు సూచించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మంత్రి బొత్సా సత్యనారాయణ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాజధాని ఏర్పాటుకు అమరావతిలో భూములు పనికి రావని, గత ప్రభుత్వం రాజధాని భూసేకరణలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు కూడా చేశారు. దీనిపై విచారణ కూడా జరుపుతున్నామనీ, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు. రాజధాని తరలిస్తారని వస్తున్న వార్తలపై అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతాంగం ఆందోళనలు వ్యక్తం చేయడంతో ప్రధాన ప్రతిపక్షం టిడిపితో పాటు బిజెపి, జనసేన, వామపక్షాల నేతలు ఆ ప్రాంతంలో పర్యటించి రైతులు ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ప్రజలు, ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రం ఇప్పటి వరకూ రాజధానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.అభివృద్ధి వికేంద్రీకరణకు వైసిపి ప్రభుత్వం మొగ్గుచూపుతుందంటూ మంత్రులు వెల్లడిస్తూ వచ్చారు.
రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న జిఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రతినిధులు ఆదివారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ భూములు గుర్తించి సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణుల కమిటీ అధికారులకు సూచించింది. ఈ సందర్భంలో కర్నూలు అభివృద్ధికి తగినన్ని నిధులు ఇప్పించాలని నిపుణుల కమిటీని కలెక్టర్ జి వీరపాండియన్ కోరారు. ఓర్వుకల్లు విమానాశ్రయం పనులు 85 శాతం పూర్తయ్యాయని, మరో 15 శాతం పనులు చేసేందుకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. జిల్లాకు వివిధ నగరాల నుండి రోడ్డు, రైలు, విమానయాన అనుసంధానాన్ని పెంచాలనీ కోరారు. మెడిటెక్ సిటీ ప్రాజెక్టు మంజూరుతో పాటు జిల్లాలో హైకోర్టు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కమిటీ కన్వీనర్ దృష్టికి తీసుకువచ్చారు.