తిరుమల: ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే రాపాక మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల ప్రకటనను ఆయనన సమర్థించారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే నన్న ఆయన.. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే పెట్టి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని చెప్పారు. తాను మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతిస్తామనని స్పష్టం చేశారు. అయితే, రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సూచించారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని… చెడు చేస్తే వ్యతిరేకిస్తామని తెలిపారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆరోపించారు.
గత కొద్ది రోజులు జనసేన ఎమ్మెల్యే రాపాక అధికార వైసీపీ ప్రభుత్వానికి దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఓవైపు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటికాలిపై లేస్తుంటే… మరోవైపు ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇంగ్లీషు మీడియం వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా స్వాగతించిన రాపాక.. అనంతరం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం సమర్థించారు. తాజాగా ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలోనూ అదే చేశారు. దీంతో ఆయన వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది.
మరోవైపు మూడు రాజధానుల ప్రకటనను తీవ్రంగా జనసేన పార్టీ తప్పుబడుతోంది. అమరావతి ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాపాక వ్యవహార శైలి వైసీపీకి దగ్గరవుతున్నారా ? అనే సందేహాలు కలిగిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఆయన ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు.
ఇటీవల జనసేన అధిష్టానంపై రాపాక చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి కావాలనే బలమైన సంకల్పం అధినేత పవన్ కల్యాణ్ లో ఉండాలని… అప్పుడే పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రతి దానికి అధినేతే వచ్చి ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతానికైతే భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందని వ్యాఖ్యానించారు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వల్లే పార్టీ నాయకులు పార్టీని వీడారని రాపాక ఆరోపించారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలను చేపడితే తాను ప్రశంసిస్తానని చెప్పారు. దీనిపై సీరియస్ అయిన పవన్ కల్యాణ్ రాపాకకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారని కూడా ప్రచారం జరిగింది.
ఇదిలావుంటే రాపాక వరప్రసాద్ త్వరలో వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని మెప్పించేలా రాపాక మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ జన్మదినం సందర్బంగా రాజోలులో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన రాపాక .. జగన్ ఫొటోకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. దాంతో అక్కడున్న వైసీపీ నేతలంతా అవాక్కయ్యారు. ఇటు రాపాక చర్యపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా రాపాక వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో ఆయన పార్టీ మారడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, రాపాక మనసులో ఏముంది ? పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా ? అనేది ఉత్కంఠగా మారింది.