అమరావతి:రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరు మంత్రులతో సమాలోచనలు ప్రారంభించడంతో మండలి రద్దుకు ఇక శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడమే తరువాయి అన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మండలి రద్దుపై వెనకాముందు ఆడుతున్నట్లు కనబడుతోంది. అధికారపక్షం వర్గాలు కూడా అదే మాటచెబుతున్నాయి.
నిజానికి అసెంబ్లీలో ఇప్పటికిప్పుడు మండలి రద్దు తీర్మానం చేసినందువల్ల జగన్ ప్రభుత్వానికి రాగల వెసులుబాటేమీ లేదు. అయితే ఎప్పటికైనా ఇది తలనొప్పి వ్యవహారమే కదా, ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కదా అన్న మీమాంస నడుస్తోంది. ఎటువంటి కీలక బిల్లుని ఆమోదించుకోవాలన్న, చట్టం చేయాలన్నా మండలిలో బలం లేదు కాబట్టి తిప్పలు తప్పవు. రానున్న రెండేళ్ల పాటు మండలిలో టీడీపీదే పైచేయి అవుతుంది. తమకున్న బలం దృష్ట్యా వైసీపీకి తగిన బలం చేకూరాలంటే రెండేళ్లు పడుతుంది. ఈ గడువులో కీలక బిల్లులకి చిక్కులు తప్పవు. ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లు మూడు నెలల్లోనే తిరిగి వస్తుందని నమ్మకం లేదు. ప్రజాభిప్రాయ సేకరణ వంటి కారణాలతో గడువు పెంచుకోవచ్చు. ప్రత్యేక ఆర్డినెన్సు తీసుకురావాలన్నా చిక్కులు వచ్చేలా ఉన్నాయి. మండలి వ్యవహారాల్లో తలనొప్పులు కంటే మండలిని రద్దు చేసేస్తే ఇక తమకు తిరుగుండదు అని జగన్ మదిలో మెదిలింది, సీనియర్లతో సంప్రదింపులు ఇంకా జరుగుతున్నాయి.
అందుకే సంకోచం…!
నిజానికి మండలి రద్దు ఆలోచన వైకాపా ముఖ్యులకు రెండు రోజుల కిందటే వచ్చింది. కానీ సుదీర్ఘ ఆలోచనలు చేస్తున్నారు. రద్దుకు కనిపిస్తున్న ఒకేఒక కారణం కీలక బిల్లులను ఆమోదించుకోడం… కానీ… రద్దు చేయకుండా కొనసాగించడానికి మాత్రం ఆ పార్టీకి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వైకాపాలో రాజకీయ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. పదవుల కోసం వేచి చూస్తున్నారు. రానున్న కాలంలో మండలిలో వైకాపా బలం పెంచుకునే అవకాశం ఉంది. దాదాపు 20 మందికి మండలిలో అవకాశాలు కల్పించే వీలుంది. జగన్ ఇచ్చిన హామీల మేరకు నాయకులకు పదవులు ఇవ్వాలంటే మండలి ఉండాలి. అందుకే రద్దుపై ముందడుగు పడడం లేదు. ఇదే సమయంలో మండలిని తన తండ్రి వైఎస్ సీఎం గా ఉన్నప్పుడే 2007లో పునః ప్రారంభించారు. ఇప్పుడు తాను రద్దు చేస్తే తండ్రి నిర్ణయానికి కట్టుబడలేదని అపవాదు వస్తుందేమో అని సంకోచిస్తున్నారు.
రద్దు సులభం కాదు…! కేంద్రం చేతికి నిర్ణయం…!
మండలి రద్దు అనేది సాధ్యమేనా? సులువైన ప్రక్రియేనా? ఇంతకూ ముందు ఎప్పుడు జరిగింది? ఎవరు, ఏ సందర్భాలలో చేశారు? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలు.
మండలిలో ప్రస్తుత పరిస్థితి ఇదీ
మొత్తం స్థానాలు : 58
ప్రతిపక్ష టిడిపి సభ్యులు : 28
అధికార వైసిపి సభ్యులు : 9
పిడిఎఫ్ సభ్యులు : 5
స్వతంత్ర సభ్యులు : 3
బిజెపి సభ్యులు : 2
నామినేటెడ్ సభ్యులు : 8
ఖాళీలు : ౩
అంటే ఆ సంఖ్యా బలమే చెప్తుంది మండలిలో వైసీపైకి చిక్కులే అని. అందుకే ఆ పార్టీ మండలిని రద్దు చేయాలని యోచించడం పెద్ద విచిత్రమేమి కాదు. శాసనమండలి రద్దు సాధ్యం కాదని, కనీసం ఏడాది పడుతుంది అని.., మండలి రద్దు అసలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాదు, కేవలం తీర్మానం మాత్రమే చేయగలరు అని టిడిపి నాయకులు అంటున్నారు.
మండలి రద్దు చేయడం అంటే అంత సులువు కాదు. అదే సమయంలో కేంద్రం మద్దతు ఉంటె అంత కష్టమూ కాదు. కాకపోతే సమయం పడుతుంది.
* రాజ్యాంగంలోని 168 , 169 ఆర్టికళ్ళలో రాష్ట్రాల శాసనమండలిల ఏర్పాటు, రద్దు అంశాలను చేర్చారు. ముందుగా మండలి రద్దుని కోరుతూ శాసనసభలో మూడులో రెండొంతుల సభ్యుల మద్దతుతో తీర్మానం చేయాలి. దీన్ని గవర్నర్ పరిశీలించి పార్లమెంటుకి పంపిస్తారు. పార్లమెంటులో చర్చించిన తర్వాత ఆమోదం పొందితే రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమొదించి సంతకం చేస్తే మండలిని రద్దు చేస్తారు. ఏర్పాటు చేయాలన్న ఇదే విధానం అమలులో ఉంది. దీనికి కనీసం ఏడాది వరకు సమయం పట్టొచ్చు.
* రాష్ట్రంలో 1958 జులై 1 న శాసనమండలి ఏర్పాటయింది. 1985 లో తొలిసారి రద్దయింది. మళ్లీ 2007 లో ప్రారంభమయింది. గతంలో 1983 లో అధికారం లోకి వచ్చిన తర్వాత తమకు మండలిలో బలం లేకపోవడంతో నాటి టిడిపి ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసింది. అనేక చర్చల తర్వాత 1985 లో పార్లమెంట్ దీన్ని ఆమోదించి రద్దు చేసారు. మళ్లీ 1989 లో అధికారం చేపట్టిన కాంగ్రేస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటు కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇది పార్లమెంటులో చర్చించి, ఆమోదించేలోగా పార్లమెంటు గడువు ముగిసి ఎటువంటి ముందడుగు పడలేదు. మళ్లీ 2004 లో అధికారం చేపట్టిన కాంగ్రేస్ పార్టీ రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు కోరుతూ 2004 జులై 8 న శాసనసభలో తీర్మానం చేసి పంపించారు. రెండేళ్ల తర్వాత 2006 డిసెంబర్ లో దీన్ని పార్లమెంటులో ఆమోదించగా 2007 జనవరి లో రాష్ట్రపతి సంతకం చేసారు. అలా 2007 మార్చి ౩౦న మండలి ఏర్పాటు జరిగింది.
శ్రీనివాస్ మానెం